
దేశంలో నిర్వహించే జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పలువురు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి అభినందనలు తెలియజేశారు.
చట్ట పరమైన ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా శాస్త్రీయ పద్ధతిలో దేశంలో కుల గణన పూర్తి చేసిన ఘనత తెలంగాణకు దక్కుతుందని, ఇది దేశానికి రోల్ మాడల్గా ఉంటుందని వారు ముఖ్యమంత్రి గారితో అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారు కేశవరావు గారు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాజకీయ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో విజయవంతంగా కుల గణన పూర్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి రావడం సంతోషకరమైన పరిణామంగా వారు పేర్కొన్నారు.

