
జపాన్ దేశం హిరోషిమా నగరంలోని జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఇద్దరు తెలుగు అమ్మాయిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎదుట తెలంగాణ అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ ఆలపించడం అందరినీ ఆకట్టుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, హిరోషిమా లెజిస్లేచర్ ప్రతినిధిలతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించడానికి వెళ్లిన సమయంలో హర్షిణి (8 వ తరగతి), హరిణి (7 వ తరగతి) వారి కుటుంబ సభ్యులతో కలిసొచ్చి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆ విద్యార్థినులు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డి గారి చిత్రాన్ని గీసిన పెన్సిల్ స్కెచ్ పెయింటింగ్స్ ను అందించారు. ఆ పెయింటింగ్స్ చూసి ఆనందం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గారు వారితో కొద్దిసేపు ముచ్చటించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ పిల్లలిద్దరూ గాంధీ విగ్రహం వద్ద జయ జయహే తెలంగాణ.. గీతాన్ని ఆలపించారు.

