
మిస్ వరల్డ్ (Miss World) 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (#RevanthReddy) గారు అధికారులను ఆదేశించారు. మే నెల 10 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న MISS WORLD-2025 ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్లో 72 వ మిస్ వరల్డ్ (#MissWorld) నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను సమావేశంలో అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసే అతిథుల కోసం ఎయిర్పోర్టు, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారులను ఆదేశించారు.
తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అతిథుల ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కార్యక్రమాలకు సంబంధించి విభాగాల వారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని, మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పూర్తి చేయాల్సిన పనులు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
