
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీని (Hiroshima Prefectural Assembly) సందర్శించింది. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు, అధికారులు ఉన్నారు. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటో గారు, అసెంబ్లీ ప్రతినిధులు తెలంగాణ బృందానికి ఘన స్వాగతం పలికారు.
హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ ప్రతినిధుల సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, “హిరోషిమాకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. హిరోషిమా అంటే నమ్మకానికి, పునర్నిర్మాణానికి చిహ్నం. ప్రజల ఐక్యతతో ఏదైనా సాధ్యమని నిరూపించిన నగరం నగరం ఇది. హిరోషిమా మాదిరిగానే ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ. సకలజనుల పోరాటంతో విజయం సాధించిన రాష్ట్రం మాది” అని అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, “తెలంగాణ బృందం హిరోషిమా సందర్శన కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదు, పరస్పర సహకారం, భాగస్వామ్యాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. శాంతి, స్థిరత్వం, సమృద్ధి విలువలను పంచుకుందాం” అని పిలుపునిచ్చారు.
“జపాన్కు చెందిన 50కి పైగా కంపెనీలు తెలంగాణలో విజయవంతంగా పనిచేస్తున్నాయి. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, మ్యానుఫాక్చరింగ్ రంగాల్లో మరిన్ని కంపెనీలను స్వాగతిస్తున్నాం. తెలంగాణ భారతదేశానికి గేట్వే, ప్రపంచానికి అనుసంధాన వేదిక. హిరోషిమా-హైదరాబాద్, జపాన్-తెలంగాణ మధ్య బలమైన సంబంధాల వారధిని నిర్మిద్దాం” అని మంత్రి గారు అన్నారు.

