CM Sri. A. Revanth Reddy participated in Vigyan Vaibhav – 2025 at Gachibowli Stadium, Hyderabad.

రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ మేరకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలన్నారు. దేశ రక్షణ రంగానికి ముఖ్య కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని కోరారు.

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్- 2025 ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. సభా ప్రాంగణంలో శాస్త్ర రంగంలో దిగ్గజులైన దివంగత భారతరత్నాలు సీవీ రామన్ గారు, అబ్దుల్ కలాం గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి గారు కీలక అంశాలను ప్రస్తావించారు..

“తెలంగాణ రాష్ట్రం.. ప్రత్యేకించి హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీడీఎల్, డీఆర్‌డీఓ, మిథాని, హెచ్ఏఎల్ వంటి సంస్థలు దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

దేశ రక్షణ రంగానికి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. ఈ రెండు నగరాల మధ్య “హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్”ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనూ కోరాం.

“హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్” ఏర్పాటు ద్వారా రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయి. స్కైరూట్ లాంటి స్టార్టప్, ప్రైవేటు సంస్థలు ఇప్పటికే రాకెట్లను తయారు చేస్తున్నాయి. కారిడార్ ప్రకటన రక్షణ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుంది.

హైదరాబాద్- బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ గారి సహకారం, మద్దతు ఎంతో అవసరం. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వంగా మేము ప్రయత్నిస్తాం.

దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపైనే ఉంది. ఐటీ నిపుణులతో పాటు సంప్రదాయ కోర్సులు చదివే ఇంజనీర్ల అవసరం కూడా మన దేశానికి చాలా ఉంది. యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం.

లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించి, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తి నింపడంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉపయోగపడతాయి” అని ముఖ్యమంత్రి గారు తెలిపారు.

481447100 1057371553096307 2976981449588918155 N